వాస్తవంగా చెప్పాలంటే.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మలుపులు లేవు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగాయి రాజకీయాలు. ఏ ముహూర్తాన 2009లో ప్రభుత్వం ఏర్పడిందో కానీ... అడుగడుగునా ఎన్నో రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. వైఎస్సార్ మరణంతో ఆంధప్రదేశ్ భవితవ్యమే కొత్త మలుపు తీసుకొంది. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, జగన్ పార్టీ, రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రెండు కళ్ల సిద్దాంతం, కొత్తగా రాబోయే కిరణ్ సమైక్యవాద పార్టీ.... ఇవన్నీ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు మలుపులను తిప్పాయి.
ఇటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్ వరకూ వెళ్లి ఓటర్ కార్డును సిమ్ కార్డ్ కొనడానికే కాక ఓటు వేయడానికి కూడా ఉపయోగించే ఓటర్లలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చింది. టీవీ స్టూడియోల్లో కూర్చొనే జర్నలిస్టు మేధావులకు, కోటరీలను నిర్మించుకొన్న నాయకులకూ అంతుబట్టడం లేదేమో కానీ.. ప్రజలకు అయితే రాజకీయ ముఖచిత్రంపై ఒక క్లారిటీ ఉంది.
రాష్ట్రం వరకూ అయితే ప్రస్తుత రాజకీయాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. జగన్ ను దెబ్బతీయడం వల్ల మాత్రమే తమ మనుగడ ఆధారపడి ఉందని ప్రధాన ప్రతిపక్షం ఫీలవుతోంది. అందుకే అన్ని అస్త్రాలను సంధిస్తోంది. అలాగే జగన్ ను ఎదగనీయకూడదని నిర్ణయించుకొన్న కాంగ్రెస్ హైకమాండ్ కూడా అతడిని అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అని బలంగా కోరుకొంటున్న వారు కూడా జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే మేలని అనుకొంటున్నారు.
ఇక మీడియా లెక్కలు మీడియాకు ఉన్నాయి. తమకు ఇష్టమైన వారిని పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఏపీ మీడియా. ఈ నేపథ్యంలో మీడియా టార్గెట్ జగన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో వీరందరి ప్రయత్నాల మధ్య రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందా? అనే విషయం గురించి పరిశీలిస్తే... ఇక ప్రజలు కొత్తగా అభిప్రాయానికి మార్చుకొనే తీరిక లేదని చెప్పవచ్చు!
జగన్ గురించి ఒక సమయంలో పీక్ స్టేజిలో ఊహించుకొన్న ప్రజలు, ఇప్పుడు ఆయనపై ఆసక్తిని చూపడం లేదని, జగన్ పేరును ముందులాగా చర్చించుకోవడం లేదని ఒక వర్గం మీడియా అంటోంది. మరి ప్రజలకు వేరే పనేం లేదా? ఎంతసేపూ జగన్ గురించినే ఆలోచించుకుంటూ ఉంటారా? వాస్తవానికి జగన్ కు ఉన్న ఓటు బ్యాంకు పరిశీలిస్తే.. అందులో ముఖ్యమైనది వైఎస్సార్ సంపాదించి పెట్టిపోయినది. రెండోది కులం బలం, మూడోది యువకుడు అనే పాజిటివ్ యాంగిల్, ముస్లింలు, క్రిస్టియన్లు.
వీరిలో ఒక వర్గం కూడా రాజకీయ పరిణామాలతో ప్రభావితం అయ్యేది కాదు. ఆరోగ్యశ్రీ, ఇతర వైఎస్సార్ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు 2009లోనూ జగన్ ను అభిమానించారు, 2014కూ వారు అదే మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రాంతాల, పరిణామాల తేడా ఉండదని చెప్పవచ్చు. ఇక కులం.. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే వాళ్ల కులంలో గొప్ప యూనిటీ వచ్చింది. వైఎస్సార్ గురించి కాంగ్రెస్ , వాళ్లు తెలుగుదేశం వాళ్లు పేల్చిన మాటలు రెడ్లను జగన్ వెంట నిలబడేలా చేశాయి. జగన్ గురించి ఇంకెంతగా మీడియా చెడుగా చెప్పినా వారు కూడా మారే అవకాశం లేదు. జగన్ తను సమైక్యవాదినని ప్రకటించడం అనే ఫ్యాక్టర్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఒకవర్గం విశ్లేషణ. ఇది ఎంత మాత్రం నిజం కాబోదు.. ఎందుకంటే.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి సీమ తరపున వాయిస్ వినిపిస్తే దానికే చాలా స్పందన వచ్చింది. మరి జగన్ సమైక్యవాదం అంటే స్పందన లేదనడం మూర్ఖత్వం మాత్రమే!
ఇక క్రిస్టియన్లలో కూడా జగన్ తమ వాడనే ఫీలింగ్ ఉంది. ముస్లింలో ఉన్నది వైఎస్సార్ పై అభిమానం. అది ప్రస్తుతానికి జగన్ వైపే ఉండవచ్చు! ఇక జగన్ పై భ్రమలు తొలగిపోయి కాంగ్రెస్ నో, తెలుగుదేశంనో ప్రజలంతా ఎంచుకొవచ్చు కదా.. అంటే.. ఈ నాలుగేళ్లలో ఆరెండు పార్టీలు సాధించిన దిగ్విజయాలు ఏమిటి?
అధికార కాంగ్రెస్ ను సహజమైన పాలన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన అంశం నిండా ముంచేస్తుందనడంలో సందేహం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన అంశం గురించి క్లారిటీ ఇవ్వలేదు. అనుకూల మీడియా తెలుగుదేశంలోని ఈ లోపాన్ని ఎంతగా కవర్ చేసినా... తెలుగుదేశం వాళ్లు సీమాంధ్రలో సీమాంధ్ర మాట, తెలంగాణలో తెలంగాణ మాట మాట్లాడినా.. ఈ పరిణామాలన్నింటినీ గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అభిప్రాయాలను మార్చుకొనేంత దృశ్యాలేమీ చోటుచేసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఆయా పార్టీల్లోని లోపాలు ఈ స్తబద్దతకు కారణం అవుతున్నాయి!
- See more at: http://telugu.greatandhra.com/politics/gossip/jagan-ku-kotha-vote-lu-ravu-50053.html#sthash.CdnM4bBd.mcsr9mDr.dpuf
0 comments:
Post a Comment