మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. గుంటూరు జిల్లాలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. తాము పార్టీ మారే ప్రసక్తి లేదని మోపిదేవి కుటుంబ సభ్యులు చెబుతున్నా, ఆ మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. జగన్ పార్టీలో చేరడానికి మోపిదేవి నిర్ణయించుకున్నారని, ప్రకటన చేయడమే తరువాయి అని కాంగ్రెసు కార్యకర్తలు అంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ దాదాపు 12 నెలలుగా చంచల్గుడా జైలులో ఉంటున్నారు. జగన్ కేసులో అరెస్టయిన పెద్దల్లో మొదటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వాన్పిక్ ప్రాజెక్టుకు అక్రమంగా భూములు కేటాయించడంలో మోపిదేవిపై ఆరోపణలు వచ్చాయి. మోపిదేవి వెంకటరమణకు తగిన సాయం అందించడంలో కాంగ్రెసు పార్టీ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. మత్స్యకారుల నుంచి రాష్ట్రంలో శానససభకు ఎన్నికైన ఏకైక నాయకుడు మోపిదేవి వెంకటరమణ. ఆయన అరెస్టుతో స్థానిక కాంగ్రెసు కార్యకర్తలు బిత్తరపోయారు. మోపిదేవి అరెస్టుతో స్థానికంగా కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు చూసేవారు కూడా లేకుండాపోయారు. మోపిదేవి వెంకటరమణ ప్రాతినిధ్యం వహిస్తున్న శానససభా నియోజకవర్గానికి ఇంచార్జీని నియమించాలని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరారు. వెంకటరమణ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లే శానససభా నియోజకవర్గం బాపట్ల లోకసభ స్థానంలో ఉంది. పనబాక లక్ష్మి బాపట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన సోదరుడికి సహాయం చేయడానికి కాంగ్రెసు నాయకులు ముందుకు రావడం లేదని మోపిదేవి సోదరుడు హరనాథ్ విమర్శిస్తున్నారు. ఈ తాజా పరిణామాలను బట్టి చూస్తే మోపిదేవి వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోందని అంటున్నారు.
source:thatstelugu
source:thatstelugu
0 comments:
Post a Comment