Home » »
షిండేకు శ్రీమతి విజయమ్మ రాసిన లేఖ సారాంశం 
‘అన్ని రాజకీయ పార్టీలు రాతపూర్వకంగా తమ ఆమోదాన్ని తెలిపిన తర్వాతే తెలంగాణాకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) నిర్ణయం తీసుకుంది. సీపీఎం మినహా రాష్ట్రానికి చెందిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణాకు తమ మద్దతు ప్రకటించాయి’...   మీరు గత  శనివారం (సెప్టెంబర్ 7, 2013) ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా  పత్రికలలో ప్రముఖంగా ప్రచురితమైంది.
ఇలాంటి ఉత్తరం మీకు రాయాల్సి వస్తుందని బాధ్యత కల్గిన ఒక రాజకీయ పార్టీగా మేం ఊహించలేదు.  మీ మాటల్లో వాస్తవ వక్రీకరణలను సరిచేసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ లేఖ పంపిస్తున్నాం. 
రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకవైపు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నపుడు, ఆ రెండు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు బంద్ లు, సమ్మెలు చేస్తున్నపుడు...రాజకీయ పార్టీలన్నింటి మధ్య వంద శాతం ఏకాభిప్రాయం సాధించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలుగుతోంది?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం జూలై-30న వెలువడితే, అంతకు ముందే... జూలై-25నే మా పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం కేంద్ర హోం మంత్రిగా, సీడబ్ల్యూసీలో సభ్యునిగా ఉన్న మీకు తెలియదంటారా?
మా పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు తమ పదవులకు రాజీనామాలు చేయడమే గాక, విభజనకు వ్యతిరేకంగా 12 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసింది కూడా కేంద్ర హోం మంత్రిగా ఉన్న మీకు తెలియదంటారా? 
మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ ఆధ్వర్యంలో విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రధానిని, రాష్ట్రపతిని, మిగిలిన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి ఒకరోజు ఢిల్లీలో దీక్ష చేసిన సంగతి కూడా మీకు తెలియదంటారా?
 గతంలో కూడా మీ పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ గారు ఇలానే నిజాలను వక్రీకరించటం ఒక పనిగా పెట్టుకున్నారు. తను మీడియాతో మాట్లాడిన అంశాలు వాస్తవాలను వక్రీకరించటమే అని తెలియజేస్తూ... ప్రధానమంత్రిగారికి లేఖ రాస్తూ... మా రాష్ట్రంలో మూడు పార్టీలు విభజనకు వ్యతిరేకిస్తున్నాయి అని సుస్పష్టంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఎంఐఎం అని చెబుతూ లేఖ రాశాం.
 కేంద్ర హోం మంత్రిగా ఉన్న మీకు ఆ లేఖలో మేము సుస్పష్టంగా  ఏం చెప్పినదీ తెలియదంటారా?
 
మా రాష్ట్రాన్ని మీరు ఒక ప్రాంతంలో సీట్లు, ఓట్ల కోసం అడ్డగోలుగా విభజిస్తే... కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్ళు తప్ప మంచి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అని కాంగ్రెస్ అంటోంది. మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే- పోలవరానికి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి?
 వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 10 ఎంపీ సీట్ల కోసం, ఓట్ల కోసం ఈ రాష్ట్రంలోని కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం మరోసారి చెబుతున్నాం. ఈ దుర్మార్గమైన ఆలోచనల్ని కట్టిపెట్టండి.సమైక్యంగానే ఉంచండి.

Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger