Home » , , , » ఇవిగో సాక్ష్యాలు

ఇవిగో సాక్ష్యాలు

పద్మాలయా స్టూడియోలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని హైకోర్టులో పిటిషన్ వేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేసి టిఆర్‌ఎస్ నేత టి హరీశ్‌రావు 80 లక్షల రూపాయలు దండుకున్నారని టిఆర్‌ఎస్ బహిష్కృత నేత ఎం రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. పద్మాలయ స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకున్న యాజమాన్యం మెదక్ ఎంపి విజయశాంతి ఇంట్లో హరీశ్‌రావుకు సదరు డబ్బులు అందజేసినట్టు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆయన వివరించారు. తన వద్ద ఉన్న ఆధారాలను సోమ, మంగళవారాల్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి అందజేసి దర్యాప్తు జరిపించాలని కోరనున్నట్టు రఘునందన్‌రావు తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం రఘునందన్‌రావు మీడియాతో మాట్లడుతూ, తాను పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు వసూలు చేశానని ఆరోపిస్తూ టిఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించారని తెలిపారు. అయితే తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 48 గంటల్లో ఆధారాలను అందజేయాలనీ, లేనిపక్షంలో తానే టిఆర్‌ఎస్ నేతల వసూళ్ళ దందాను బయటపెడుతానని చెప్పానని ఆయన గుర్తు చేశారు. తన సవాల్‌ను టిఆర్‌ఎస్ నేతలు స్వీకరించడం కానీ, తాను వసూళ్ళకు పాల్పడినట్టు సాక్ష్యాధారాలను కానీ వారు చూపలేకపోయారని రఘునందన్‌రావు తెలిపారు. తనపై టిఆర్‌ఎస్ చేసిన అభియోగాలకు వారి వద్ద ఎలాంటి రుజువులు లేవని తేలిపోయిందని ఆయన తెలిపారు. తనను అక్రమంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయడం లేదని, అయినప్పటికీ వారు చేసిన వసూళ్ళ దందాపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ సిబిఐని, డిజిపిని కలవనున్నట్టు ఆయన తెలిపారు.
పద్మాలయా స్టూడియోతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ హరీశ్‌రావు డిసెంబర్ 3, 2008లో హైకోర్టులో పిటిషన్ వేశారని రఘునందన్‌రావు వివరించారు. ఈ కేసుపై 2009 మార్చి 6న హైకోర్టు తీర్పునిస్తూ రెవిన్యూ మంత్రికి, పిటిషన్‌దారుకు కొన్ని సూచనలు చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ కేసులో హరీశ్‌రావు ముందుకు వెళ్లకుండా ఉండేందుకు పద్మాలయా స్టూడియో యాజమాన్యం, ఇద్దరు సినీ రంగ ప్రముఖులను ఆశ్రయించగా, వారు ఎంపి విజయశాంతి ఇంట్లో ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ సమక్షంలో హరీశ్‌రావుతో రాజీ కుదుర్చుకుని 80 లక్షల రూపాయలు చెల్లించారని రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ మొత్తాన్ని విజయశాంతి ఇంటికి వచ్చిన హరీశ్‌రావు కారులో అప్పట్లో ఆమెకు మేనేజర్‌గా ఉన్న వ్యిక్తి ఒక సంచిలో పెట్టి పంపించారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత మూడు నెలలకు సదరు మేనేజర్‌ను ఉద్యోగంనుంచి తొలగించారని ఆయన తెలిపారు. పద్మాలయా స్టూడియో యాజమాన్యం నుంచి హరీశ్‌రావుకు డబ్బులు అందజేసిన మేనేజర్‌ను సిబిఐకి అప్పగిస్తానని ఆయన తెలిపారు. తాను బయట పెట్టేది మచ్చుకు ప్రస్తుతానికి ఒక్కటేనని, ఇలాంటి ఉదంతాలను చాలా ఉన్నాయని, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను అన్నింటిని దర్యాప్తు సంస్థలకు అప్పగించిన తర్వాతనే మీడియాకు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. దర్యాప్తు సంస్థలకు సాక్ష్యాధారాలు అందించకుండా మీడియాకు వెల్లడించడం వల్ల సాక్షులను టిఆర్‌ఎస్ నాయకులు బెదిరించే అవకాశం ఉండడటం వల్లనే వాటిని ఇప్పడే బయట పెట్టడం లేదని ఆయన తెలిపారు. పద్మాలయా స్టూడియో చెల్లించిన మొత్తంనుంచి హరీశ్‌రావు కెసిఆర్‌కు, ఆయన కూతురు కవితకు ఎంత ఇచ్చింది ఆయనే చెప్పాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
తాము పార్టీ కోసం విరాళంగా డబ్బులు తీసుకుంటే తప్పేమిటనీ టిఆర్‌ఎస్ నాయకులు వాదిస్తున్నారనీ, మరి ఎవరెవరి నుంచి ఎంత డబ్బులు తీసుకున్నది ఎన్నికల కమిషన్‌కు అందజేసిన వివరాల్లో పేర్కొన్నారా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. వారం రోజల్లో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి టిఆర్‌ఎస్ అందజేసిన విరాళాల జాబితాను తీసుకుంటానని, ఆ తర్వాత తన వద్ద ఉన్న వసూళ్లకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని రఘునందన్‌రావు తెలిపారు. టిఆర్‌ఎస్‌పై తాను ఆరోపణలు చేసాక, ఆ పార్టీ నాయకుల నుంచి తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, అయినప్పటికీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఎవరికి భయపడకుండా టిఆర్‌ఎస్ బండారాన్ని బయట పెడతానని ఆయన తెలిపారు. పద్మాలయా స్టూడియోతో విజయశాంతి ఇంట్లో ఒప్పందం కుదిరినప్పటికీ, ఇందులో ఆమెకు ఎలాంటి సంబంధం కానీ, వాటాకానీ లేదని రఘునందన్‌రావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

http://www.andhrabhoomi.net/content/i-89
Share this article :

0 comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Maskolis | Johny Portal | Johny Magazine | Johny News | Johny Demosite
Copyright © 2011. Andhrabhumi - All Rights Reserved
Template Modify by Creating Website Inspired Wordpress Hack
Proudly powered by Blogger